
- వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసి ప్రసిద్ధి
హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన ఇంట్లో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గరిమెళ్ల 1978 నుంచి 2006 వరకు టీటీడీ ఆస్థాన గాయకుడిగా పని చేశారు. దాదాపు వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు.
‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘జగడపు చనవుల జాజర’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’ వంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్నాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. గరిమెళ్ల మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.